Telangana: చంచల్​ గూడ జైలుకు తీన్మార్​ మల్లన్న

  • వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించిన కోర్టు
  • సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసిన మల్లన్న
Court Orders 14 Days Remand For Teenmar Mallanna

చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కు సికింద్రాబాద్ సివిల్ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ ను విధించింది. డబ్బుల కోసం తనను బెదిరించాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న ఆయన్ను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

తమకు వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే, మల్లన్నపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆయన తరఫు లాయర్ ఉమేశ్ చంద్ర కోర్టుకు తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించలేదన్నారు. అందరి వాదనలను విన్న కోర్టు.. మల్లన్నకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ ను విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.  

కొన్ని రోజులుగా తీన్మార్ మల్లన్న ఇల్లు, ఆఫీసులపై పోలీసులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అరెస్టుకు రెండు రోజుల ముందు కూడా సైబర్ క్రైమ్, సీసీఎస్ పోలీసులు సోదాలు చేశారు. హార్డ్ డిస్క్ లు, కీలకమైన పత్రాలను తీసుకెళ్లారు. అయితే, తమను పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారంటూ మల్లన్న తల్లి, భార్య ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క, తీన్మార్ మల్లన్న కూడా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

More Telugu News