పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణంపై విచారణ కమిటీ వేసిన మమతా బెనర్జీ

Bengal Sets Up Panel To Investigate Pegasus Scandal
  • సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జిలతో ద్విసభ్య కమిటీ  
  • కేంద్రం విచారణ కమిటీ వేస్తుందని భావించామన్న మమత
  • కేంద్రం మౌనంగా ఉండటంతో తాము విచారణ కమిటీ వేశామని వ్యాఖ్య
పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా విపక్ష నేతలు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, హక్కుల సంఘాల నేతలు తదితర వందలాది మంది ఫోన్ లను హ్యాక్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై పార్లమెంటు ఉభయసభలు అట్టుడుకుతున్నాయి.

మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ పై విచారణకు ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ఎంబీ లోకుర్, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జ్యోతిర్మయ్ భట్టాచార్యలతో కూడిన ద్విసభ్య కమిటీని నియమించారు. పెగాసస్ వ్యవహారంలో తొలి అధికారిక విచారణ కమిటీ ఇదే కావడం గమనార్హం. ఆరు నెలలలో కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ, పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ ను వేస్తుందని తాము భావించామని... అయితే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయిందని విమర్శించారు. దీంతో తామే విచారణ కమిషన్ ను వేస్తున్నామని చెప్పారు. తాము వేసిన ఈ చిన్న అడుగు ఇతరులను కూడా మేల్కొలుపుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్ లో అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని చెప్పారు. మరోవైపు హ్యాకింగ్ కు గురైన వారి జాబితాలో మమత మేనల్లుడు, లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.
Go Back to Shorts
Mamata Banerjee
TMC
Pegasus Scandal
Investigation
West Bengal

More Telugu News