Andhra Pradesh: తండ్రీకొడుకులిద్దరూ ఇంట్లో కూర్చుని జూమ్​ లో టైం పాస్​ చేస్తున్నారు: మంత్రి కొడాలి నాని విమర్శలు

  • చంద్రబాబు, లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు
  • బాబు వదిలేసి వెళ్లిన బకాయిలు చెల్లించామని కామెంట్
  • రూ.4 వేల కోట్లు రైతులకిచ్చామన్న నాని
  • 21 రోజుల్లోపే ధాన్యం డబ్బు చెల్లిస్తున్నామని వెల్లడి
AP Minister Kodali Nani Fires On Chandrababu and Lokesh

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పప్పు, తుప్పులిద్దరూ ఇంటికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. లోకేశ్ పిచ్చికుక్కలాగా అరుస్తున్నాడని మండిపడ్డారు. తండ్రీ కొడుకులిద్దరూ జూమ్ లో టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు.

గ్రామ కక్షలతో చనిపోయిన వారిని పరామర్శించేందుకు వెళ్లి.. జగన్మోహన్ రెడ్డిపై లోకేశ్ వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తామైతే 48 గంటల్లోనే బకాయిలు చెల్లించేవారిమన్న బాబు వ్యాఖ్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు వదిలేసి వెళ్లిన బకాయిలను తాము చెల్లిస్తున్నామన్నారు. 2017, 2018, 2019 సంవత్సరాల్లో రైతులకు రూ.4 వేల కోట్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి బాబు పారిపోతే.. తాము చెల్లించామన్నారు. 21 రోజుల్లోపే ధాన్యం డబ్బులు రైతులకు ఇస్తున్నామని వివరించారు. ఇటీవలే రూ.1,637 కోట్లు చెల్లించామన్నారు. ఇంకా రూ.1,619 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. కేంద్రం అడ్వాన్స్ గా ఇవ్వాల్సిన రూ.3,200 కోట్లు రాకపోయినా.. తాము తమ ఖజానా నుంచి చెల్లిస్తున్నామన్నారు. దానిపై ఇటీవలే జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారన్నారు.

ఇవన్నీ కనిపించని చంద్రబాబు.. జగన్ పై బురదజల్లేందుకే పనికిమాలిన లేఖలు రాస్తున్నారని విమర్శించారు. కరోనా వచ్చి చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కుంటే.. ఇక్కడ దేవినేని ఉమా లాంటి వాళ్లు ఊకను చూపించి ధాన్యం కొనాలంటూ ధర్నాలు చేస్తున్నారని అన్నారు. బాబు చిటికేసినా జగన్ చిటికెన వేలి గోటిని కూడా తాకలేరని అన్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే అబ్బా కొడుకుల తాటతీస్తామని హెచ్చరించారు. ఇద్దరినీ బట్టలూడదూసి రోడ్డు మీద నిలబెడతామని మండిపడ్డారు.

మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన కొడుకు వెన్నుపోటు పొడుస్తాడన్న అనుమానంతోనే లోకేశ్ ను ఫాం హౌస్ కు పంపించారని అన్నారు. తండ్రీ కొడుకులను కుక్కల వ్యాన్ ఎక్కించి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. ఇంకోసారి జగన్ పై పిచ్చివాగుడు వాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

More Telugu News