Roja: పరీక్షలు రద్దు చేయాలంటున్న లోకేశ్ పై రోజా వ్యంగ్యం

  • ఏపీలో పరీక్షల రద్దు కోసం లోకేశ్ పోరాటం
  • మొద్దబ్బాయిల్లా తయారుచేస్తారా? అంటూ రోజా ఫైర్
  • పరీక్షలు జరిగితే విద్యార్థులకే మేలన్న రోజా
  • జగన్ మెంటల్ మామ కాదు చందమామ అంటూ కితాబు
Roja comments on Lokesh who wants to cancel exams

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు.

లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో మొద్దుల్లాగా వెనుకబడిపోవాలని కోరుకుంటున్నట్టుంది అని విమర్శించారు. ఆయన పోరాటం చూస్తే అందుకేనేమో అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరీక్షలు జరుపుతామనో, జరపబోమనో సీఎం జగన్ ఇప్పటికీ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని, లోకేశ్ ఈ విషయం గుర్తించాలని రోజా హితవు పలికారు. పిల్లల భవిష్యత్తు బాగుండేలా ఈ పరీక్షలు జరపడానికి అనువైన సమయం కోసం సీఎం జగన్ చూస్తున్నారని వివరించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు ఆరు శాతానికి వచ్చిందని, పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పరీక్షలు జరిపితే వారికి నాణ్యమైన విద్యను అందించిన వారమవుతామని రోజా పేర్కొన్నారు. పరీక్షలు లేకపోతే లోకేశ్ వంటి మొద్దు పిల్లలు సంతోషపడతారేమో కానీ, బాగా చదివే పిల్లలు పరీక్షలు లేకపోతే ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఇంటర్ చదువే ప్రాతిపదిక అని, ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థుల్లో ఉదాసీన వైఖరి ఏర్పడుతుందని రోజా అభిప్రాయపడ్డారు.

జగన్ పై మెంటల్ మామ అని విమర్శలు చేస్తుండడంపైనా రోజా చిరునవ్వుతో స్పందించారు. జగన్ మెంటల్ మామో, చందమామో ప్రజలందరికీ తెలుసని, చందమామ వంటి జగన్ ను విద్యార్థులు ఎంతో ఆప్యాయంగా మామ అంటారని వివరించారు. ఆ మెంటల్ అనేది చంద్రబాబు, లోకేశ్ లకు వర్తిస్తుందని విమర్శలను తిప్పికొట్టారు.

More Telugu News