Nara Lokesh: గతేడాది చేసిన తప్పునే ఇప్పుడూ చేస్తున్నారు: నారా లోకేశ్

  • పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయండి
  • గతేడాది కూడా ఇలానే వాయిదా వేసి చివరికి రద్దు చేశారు
  • లక్షల మంది చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దు
Nara Lokesh fires on AP Govt on Exams

పది, ఇంటర్ పరీక్షల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాపై టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మరోమారు విరుచుకుపడ్డారు. పరీక్షల విషయంలో గతేడాది చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పరీక్షల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇలానే రెండు సార్లు పరీక్షలను వాయిదా వేసి చివరికి రద్దు చేశారని గుర్తు చేశారు.

కరోనా మూడో దశ ప్రభావం పిల్లలపైనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని, అయినప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ సహా 14 రాష్ట్రాలు 10, 11 తరగతి పరీక్షలను రద్దు చేశాయని, కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

More Telugu News