Andhra Pradesh: ఏపీలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది: వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి

  • కోవిడ్ సెంటర్లను మళ్లీ తెరిచాము
  • 21 వేల మందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించా
  • రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్ డిసివిర్ లకు లోటు లేదు
Corona is spreading fast in AP says Ashok Singhal

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కోవిడ్ సెంటర్లను మూసేశామని... ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో మళ్లీ వాటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

అన్ని ఆసుపత్రుల్లో పడకలు, ఔషధాలు సిద్ధం చేయాలని ఆదేశించామని తెలిపారు. 21 వేల మంది వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 320 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉందని... బళ్లారి, చెన్నై నుంచి మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుందని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 36 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 8 వేల రెమ్ డిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని సింఘాల్ చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్  డిసివిర్ అవసరం అంతగా లేదని అన్నారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో 19 వేల పడకలను సిద్ధం చేశామని... ఇప్పటి వరకు 11 వేల పడకలు నిండిపోయాయని తెలిపారు. మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తున్నామని చెప్పారు.

More Telugu News