Etela Rajender: గాంధీ ఆసుప‌త్రిలో మొద‌టిసారి 600 మందికిపైగా రోగులు ఐసీయూలో ఉన్నారు: ఈట‌ల‌

  • రెమ్‌డెసివిర్ స‌ర‌ఫ‌రాను కేంద్ర ప్ర‌భుత్వం అధీనంలోకి తీసుకుంది
  • 21,550 ఇంజ‌క్షన్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది
  • కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు డ‌బ్బులు క‌ట్ట‌ని రోగుల‌ను గాంధీకి పంపుతున్నాయి
  • రోగుల ప‌రిస్థితి విష‌మిస్తే కూడా పంపుతున్నాయి
eetala on corona cases

గాంధీ ఆసుప‌త్రిలో మొద‌టిసారి 600 మందికిపైగా రోగులు ఐసీయూలో ఉన్నారని తెలంగాణ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు డ‌బ్బులు క‌ట్ట‌ని రోగుల‌ను గాంధీకి పంపుతున్నాయని చెప్పారు.  

రోగుల ప‌రిస్థితి విష‌మిస్తే కూడా కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు గాంధీ ఆసుప‌త్రికి పంపుతున్నాయని తెలిపారు. ప్రైవేటు ఆసుప‌త్రులు రోగిని చేర్చుకున్న‌ప్ప‌టి నుంచి వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, మంచి వైద్యం అందించాల‌ని చెప్పారు. మ‌రోవైపు, రెమ్‌డెసివిర్ స‌ర‌ఫ‌రాను కేంద్ర ప్ర‌భుత్వం తన అధీనంలోకి తీసుకుందని ఆయ‌న తెలిపారు.

తెలంగాణ‌ 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కోసం ఆర్డర్లు ఇస్తే 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని, దీనిపై నిరసన తెలుపుతున్నామ‌ని అన్నారు. తెలంగాణ‌లో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు.  హైదరాబాద్‌లో తెలంగాణకు చెందిన‌ రోగులే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, కర్ణాటకకు చెందిన‌ రోగులు కూడా చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు.

More Telugu News