Jammu And Kashmir: కశ్మీర్ లో తగ్గుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు... టెర్రరిజంపై యువత విముఖత!

Downfall in terrorist activities at Jammu Kashmir
  • దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్
  • పెచ్చరిల్లిన ఉగ్రవాదం
  • యువత దృష్టిని మరల్చేందుకు అధికారుల యత్నాలు
  • ఫలితాన్నిస్తున్న నూతన కార్యక్రమాలు
  • తగ్గిన ఉగ్రదాడుల సంఖ్య
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నో దశాబ్దాలుగా కశ్మీర్ అంశం హింసకు కేంద్ర బిందువుగా కొనసాగుతోంది. వేలమంది ఉగ్రవాద చర్యలతో ప్రాణాలు కోల్పోయారు. అయితే, గతేడాది కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాల్లో తగ్గుదల కనిపించిందని కేంద్ర భద్రత వ్యవస్థలు పేర్కొన్నాయి. 2021లో ఇప్పటివరకు టెర్రరిస్టు ఘటనలు 25 శాతం మేర తగ్గాయి. ముఖ్యంగా ఇక్కడి యువత ఉగ్రవాద కార్యకలాపాల పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

2020లో 167 మంది కశ్మీరీలు టెర్రరిస్టు సంస్థల్లో చేరగా, ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది మాత్రమే ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు. వారిలో కనీసం 8 మంది ఎన్ కౌంటర్లలో హతులవ్వడమో, పట్టుబడడమో జరిగింది. 2020లో ఇదే సీజన్ లో జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడుల సంఖ్య 58 కాగా, ఈ ఏడాది 43 ఘటనలే జరిగాయి. అదే సమయంలో... ఆచూకీ లేకుండా పోయారని, లేక, ఉగ్రవాద సంస్థల్లో చేరారని భావించిన 9 మంది తమ ఇళ్లకు తిరిగివచ్చారు.

ఇటీవల జమ్మూకశ్మీర్ లో యువత ప్రాతినిధ్యం ఉండేలా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దేశాన్ని చుట్టివచ్చేలా స్టడీ టూర్లు, ఏడాది పొడవునా క్రీడాపోటీలు, విద్యాభ్యాసానికి సాయం చేసే చర్యలు, డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్లు నిర్వహించడం ద్వారా యువత దృష్టిని ఉగ్రవాదం నుంచి మరల్చగలుగుతున్నట్టు జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు.
Jammu And Kashmir
Terrortism
Youth
India
Pakistan

More Telugu News