Kamal Haasan: తెలుగు వారు, ఫ్యాన్స్ అధికంగా ఉన్న స్థానం నుంచి క‌మ‌ల‌హాస‌న్ పోటీ

  • త‌మిళ‌నాడు  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
  • కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచి బ‌రిలోకి క‌మ‌ల్
  • పార్టీ కార్యకర్తల కోరిక మేరకే అని చెప్పిన ఎంఎన్‌ఎం అధ్య‌క్షుడు
kamal to contest from kovai

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థు‌ల గురించి సినీ న‌టుడు క‌మ‌ల హాస‌న్‌కు చెందిన మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) వ‌ర్గాలు ప‌లు వివ‌రాలు తెలిపాయి. త‌మ పార్టీ అధ్యక్షుడు కమల హాసన్‌ కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచి పోటీ చేయనున్నారని వెల్ల‌డించాయి. ఆ స్థానంలో తెలుగువారు  ఎక్కువగా ఉండడం, త‌న అభిమానులూ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అధికంగా ఉండ‌డంతో ఇక్క‌డి నుంచే పోటీ చేయాల‌ని క‌మ‌ల్ నిర్ణ‌యం తీసుకున్నారు.

 ఈ విష‌యంపై క‌మ‌ల హాస‌న్ స్పందిస్తూ... తన తండ్రి తనను ఐఏఎస్‌ అధికారిగా చూడాలనుకున్నారని, అయితే తాను ఆయన కలల్ని నిజం చేయలేకపోయానని తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే తమ పార్టీలో పలువురు మాజీ ఐఏఎస్ లకు చోటు కల్పించానని చెప్పారు. రాజకీయాలు తన వృత్తి కాదని చెప్పారు. త‌మ పార్టీ కార్యకర్తల కోరిక మేరకే తాను కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచి పోటీ చేస్తున్నాన‌న్నారు.  

కాగా, గ‌త  పార్లమెంటు ఎన్నికల్లో ఎంఎన్‌ఎం అభ్యర్థికి ఈ స్థానం నుంచే 11 శాతానికి పైగా ఓట్లు వ‌చ్చాయి. క‌మ‌ల్ పార్టీ తరఫున చెన్నైలోని మైలాపూర్‌ నియోజకవర్గం నుంచి సినీ‌ నటి శ్రీప్రియ బ‌రిలోకి దిగుతున్నారు.

More Telugu News