Home Ministry: ఓసీఐల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలు

  • మత కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి
  • విలేకరుల సమావేశం పెట్టాలన్నా అనుమతి కావాల్సిందే
  • ఎఫ్ఆర్ఆర్ వోలో దరఖాస్తుకు అవకాశం
  • విదేశీ సంస్థల ఇంటర్న్ షిప్ కూ వర్తింపు
OCI Need Permission For Tabligh Journalistic Activities Home Ministry frames new rules

విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ మూలాలు వున్న వ్యక్తులు  (ఓసీఐ– ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా) ఇకపై దేశంలో తబ్లిగీ లేదా మతపరమైన కార్యక్రమాలు, విలేకరుల సమావేశాలు నిర్వహించాలంటే హోం శాఖ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ మేరకు కేంద్ర హోం శాఖ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఓసీఐ కార్డు కలిగి ఉన్నోళ్లు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలనుకుంటే విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్ వో)లో దరఖాస్తు చేసుకుని ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలని పేర్కొంది.

విదేశీ సంస్థలకు సంబంధించి ఏదైనా ఇంటర్న్ షిప్, పరిశోధనలు చేయాలనుకునే ఓసీఐ పౌరులూ అనుమతులు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. అనుమతులు తీసుకున్నాక చిరునామాల్లో ఏవైనా మార్పులు చేస్తే.. కచ్చితంగా ఎఫ్ఆర్ఆర్ వోకు సమాచారమివ్వాలని సూచించింది.

దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణం తబ్లిగీ జమాత్ నిర్వహించిన సమావేశాలేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వమూ వారిపై దృష్టి సారించింది. దేశ వ్యాప్తంగా ఆ సమావేశాలకు హాజరైన వారి ఆచూకీని గాలించింది. దీనిపై 36 మంది విదేశీయులపై కేంద్ర ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది.

More Telugu News