Uttam Kumar Reddy: వామనరావు దంపతుల హత్యలపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు?: ఉత్త‌మ్‌

  • గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన కాంగ్రెస్ నేత‌లు
  • సమగ్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞ‌ప్తి
  • దళితుడి లాకప్ డెత్‌పై వామనరావు కేసు వేశారు  
  • చివ‌ర‌కు వారే ప్రాణాలు కోల్పోయారన్న శ‌్రీధ‌ర్ బాబు
uttam meets govener

ఓ కేసులో హైకోర్టులో పిటిష‌న్‌ వేసినందుకే లాయ‌ర్ వామ‌న‌రావు దంప‌తుల‌ను దారుణంగా చంపార‌ని కాంగ్రెస్ తెలంగాణ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే, ఈ కేసులో పోలీసులు స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆయ‌న ఆరోపించారు.  

ఈ రోజు గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు లాయర్ దంపతుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం కాంగ్రెస్ నేత‌లు మీడియాతో మాట్లాడారు. ఈ ఘ‌ట‌న‌పై కేసీఆర్ ఎందుకు స్పందించ‌ట్లేద‌ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ కేసులో పుట్టా మధుకు స్థానిక పోలీసు కమిషనర్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు.

ఈ ప్రభుత్వంపై త‌మకు నమ్మకం లేదని, కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడని ఆయ‌న చెప్పారు. ఈ కేసులో  నేరుగా కోర్టు ద్వారానే విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ఈ విష‌యంపై తాము సీజేఐతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశామని వివ‌రించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు మీడియాతో మాట్లాడుతూ...  లాయర్ దంప‌తుల‌ హత్య  దురదృష్టకరమని అన్నారు. శీలం రంగయ్య అనే దళితుడి లాకప్ డెత్‌పై లాయ‌ర్ వామన‌రావు దంపతులు కోర్టులో కేసు వేశారని ఆయ‌న వివ‌రించారు.

లాక‌ప్ డెత్‌పై స్థానిక పోలీసు కమిషనర్ పట్టించుకోవడం లేదని వారు చెప్పార‌ని, కాబ‌ట్టి దీన్ని కోర్టు పట్టించుకోవాలని కోరారని శ్రీధ‌ర్ బాబు అన్నారు. చివ‌ర‌కు, లాయ‌ర్లూ ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పారు. ఈ కేసును నీరుగార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

More Telugu News