Twitter: భారత్ లో ఉద్యోగుల భద్రతే ముఖ్యం: ట్విట్టర్ 

  • ట్విట్టర్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం
  • తొలగించిన ఖాతాలను పునరుద్ధరించడంపై కేంద్రం ఆగ్రహం
  • ఐటీ మంత్రితో చర్చిస్తున్నామన్న ట్విట్టర్
Will Protect our Employees says Twitter

రైతుల ఆందోళనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంతో మంది ట్విట్టర్ ఖాతాలను నిషేధించాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేయగా, ఈ విషయంలో సమస్యను పరిష్కరించేందుకు ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే భారత ప్రభుత్వంతో మర్యాదపూర్వకంగా చర్చలు జరిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ‌తో నోటీసులు, ఇతర విషయాలపై మాట్లాడినట్టు ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ట్విటర్ ఉద్యోగులపై చర్యలు తీసుకునే విధంగా కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో తమకు తమ ఉద్యోగుల భద్రతే ప్రధానమని స్పష్టం చేశారు.

ట్విటర్ ఖాతాలకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనపై తమ నిర్ణయం మారలేదని తెలిపారు. తమ ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఇదే సమయంలో భారత ప్రభుత్వంతోనూ సంప్రదింపులు సాగిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మొత్తం 1,178 ఖాతాలను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. వారంతా పాకిస్థానీ, ఖలిస్తానీ యూజర్లని, రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

అయితే, బహిరంగంగా, స్వేచ్ఛగా సమాచారాన్ని పంచుకోవడం వల్ల సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొన్న ట్విట్టర్, అందువల్లే వాటిని నిషేధించడం లేదని అన్నారు. రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేస్తున్న ఖాతాలకు సంబంధించి తమకు అందే ప్రతి ట్వీట్ నూ సమీక్షిస్తున్నామని ప్రకటించారు.

తప్పుడు ట్వీట్లు చేస్తున్న వారి ఖాతాలను తొలగించాలంటూ కేంద్రం ఆదేశించడంతో గత వారం 257 ఖాతాలపై తాత్కాలికంగా నిషేధం విధించిన ట్విట్టర్, ఆపై గంటల వ్యవధిలోనే వాటిని పునరుద్ధరించడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలపై తీర్పు చెప్పే స్థాయిలో ట్విటర్ లేదని ఐటీ శాఖ మండిపడింది. ట్విట్టర్ ఇండియాలో కొనసాగాలంటే,  చట్టానికి లోబడి ఉండాల్సిందేనంటూ తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసింది.

More Telugu News