Uttarakhand: ధౌలిగంగా వరదల్లో 203 మంది గల్లంతయ్యారు: ఉత్తరాఖండ్ సీఎం రావత్

  • ఉత్తరాఖండ్ లో విరిగిపడిన మంచు చరియలు
  • పోటెత్తిన ధౌలిగంగా నది
  • కొట్టుకుపోయిన రుషిగంగ ప్రాజెక్టు
  • ఇప్పటివరకు 11 మృతదేహాల వెలికితీత 
Uttarakhand CM responds flash floods

ధౌలిగంగా నదికి ఆకస్మికంగా వరద పోటెత్తడంతో నిన్న ఉత్తరాఖండ్ లో విలయం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హిమాలయ పర్వతాల్లోని నందాదేవి శిఖరం నుంచి మంచు చరియలు విరిగిపడడంతో నదిలోని నీటిమట్టం పెరిగిపోయి లోతట్టు ప్రాంతాలను తుడిచిపెట్టేసింది. దీనిపై నేడు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వివరాలు తెలిపారు.

ధౌలిగంగా నది వరదల్లో ఇప్పటివరకు 203 మంది గల్లంతయ్యారని సీఎం వెల్లడించారు. వారిలో 11 మంది మృతదేహాలను వెలికితీశామని వివరించారు. రేణీ గ్రామం వద్ద రుషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని తెలిపారు. రేణీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే తపోవన్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, అక్కడే అనుబంధంగా మరో సంస్థ కూడా ఉందని సీఎం రావత్ వివరించారు. ఆ సంస్థలో పాతికమంది వరకు పనిచేస్తున్నట్టు సమాచారం ఉందని, అయితే, వారందరి ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు.

More Telugu News