app: ఫిర్యాదుల కోసం యాప్ ప్రారంభించిన నిమ్మగడ్డ.. వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌ని వెల్ల‌డి!

  • ‘ఈ-వాచ్‌’ పేరిట యాప్
  • రేప‌టి నుంచి అందుబాటులోకి యాప్
  • అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా  స‌మాచారం అందించ‌వ‌చ్చ‌న్న నిమ్మ‌గ‌డ్డ‌
nimmagadda launches app

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థల ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొనసాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు ఓ యాప్ తీసుకొచ్చారు. ‘ఈ-వాచ్‌’ పేరిట రూపొందించిన ఈ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ రోజు రాష్ట్ర‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ ఆవిష్కరించారు.  ఈ -వాచ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చ‌ని, అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా స‌మాచారం అందించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

ఫిర్యాదులు చేసిన వారి వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించిన అనంత‌రం ఆ వివ‌రాల‌ను ఫిర్యాదుదారుల‌కు చెబుతామని పేర్కొన్నారు. ఈ యాప్ రేప‌టి నుంచి ప్లేస్టోర్‌లో  అందుబాటులో ఉంటుందని వివ‌రించారు.

రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పారదర్శకత, ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకే దీన్ని విడుదల చేస్తున్నామ‌ని వివ‌రించారు. స్థానిక ఎన్నిక‌ల్లో ఓట‌ర్లంతా సొంత గ్రామాలకు వచ్చి ఓట్లెయ్యాలని ఆయ‌న పిలుపునిచ్చారు. కాగా, ఫిర్యాదుల స్వీకరణ కోసం కాల్‌ సెంటర్‌ని కూడా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ ప్రారంభించారు.

More Telugu News