America: రెచ్చిపోయిన ట్రంప్ మద్దతుదారులు.. అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు.. మహిళ మృతి

  • బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ సమావేశం
  • క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లిన ట్రంప్ మద్దతుదారులు
  • కాల్పులు, బాష్పవాయువు ప్రయోగం
  • సంయమనం పాటించాలంటూ ట్రంప్ ట్వీట్
US Congress in turmoil as violent Trump supporters

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికకు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున క్యాపిటల్ భవనం (కాంగ్రెస్ సభ్యుల సమావేశ మందిరం) లోకి దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించిన క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ఆయన గెలుపును ధ్రువీకరించేందుకు అమెరికన్ కాంగ్రెస్ సమావేశమైంది.

అయితే, బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తున్న ట్రంప్ మద్దతుదారులు నినాదాలు చేసుకుంటూ క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. ఆందోళనకారులపైకి పోలీసులు బాష్పవాయువును కూడా ప్రయోగించారు. కాల్పుల్లో ఓ మహిళ మెడలోకి తూటా దూసుకుపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

మరోవైపు, ఈ ఘర్షణతో బైడెన్ గెలుపును ధ్రువీకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. ట్రంప్ ఆదేశాలతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపు చేశాయి. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

More Telugu News