COVID19: కరోనా వ్యాక్సిన్లలో ‘వేస్టేజీ’.. 30 కోట్ల మందికి 66.6 కోట్ల డోసులు అవసరం!

  • వృథాను 10 శాతంగా పేర్కొన్న కేంద్రం
  • డబ్యూఎంఎఫ్ 1.11గా నమోదు
  • ఒక్కొక్కరికి 2.22 డోసులు అవసరమని వెల్లడి
  • అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు
Counting wastage India may need 66 cr doses of vaccine

జనానికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడత 3‌0 కోట్ల మందికి ఇవ్వనుంది. అంత మందికి రెండు డోసుల చొప్పున 60 కోట్ల వ్యాక్సిన్లు అవసరమవుతాయన్నది అందరికీ తెలిసిన లెక్కే. కానీ, 66.6 కోట్ల డోసులు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఎంత లేదనుకన్నా వ్యాక్సిన్లలో చాలా సంఖ్యలో వృథా అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది.

30 కోట్ల మందికి వ్యాక్సిన్ వెయ్యాలంటే ఎన్ని డోసులు అవసరమవుతాయో వేస్టేజ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ (డబ్ల్యూఎంఎఫ్) ద్వారా ఆరోగ్య శాఖ నిపుణులు లెక్కించారు. 10 శాతం వృథా పోవచ్చని అంచనా వేశారు. ఆ లెక్కన డబ్ల్యూఎంఎఫ్ 1.11గా ఉండొచ్చని తేల్చారు. అంటే ఒక్కొక్కరికి వ్యాక్సిన్ వేయాలంటే 2.22 డోసులు అవసరమవుతాయని లెక్కగట్టారు. మొత్తంగా 30 కోట్ల మందికి 66.6 కోట్ల డోసులు కావాలని తేల్చారు.

ఆ లెక్క ప్రకారమే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇచ్చారు. బ్లాక్, మండలం, జిల్లాల వారీగా  ఎన్ని డోసులు కావాలో చెప్పాలని పేర్కొన్నారు. వీలైనంత వరకు వృథాను తగ్గించాలని సూచించారు. కాగా, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపీ) కింద కేంద్రం కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేయనుంది. వ్యాక్సిన్ వేస్టేజ్ ను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.

More Telugu News