Nara Lokesh: సుబ్బయ్య అంతిమయాత్రలో పాల్గొన్న నారా లోకేశ్... న్యాయం జరగకపోతే మళ్లీ వస్తానని స్పష్టీకరణ

Nara Lokesh attends funerals of TDP leader Nandam Subbaiah
  • ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన సుబ్బయ్య భార్య
  • మరో ముగ్గురి పేర్లు చేర్చాల్సిందేనని స్పష్టీకరణ
  • దీక్ష చేపట్టిన లోకేశ్
  • పోలీసుల హామీతో ఇవాళ అంత్యక్రియలు
కడప జిల్లా టీడీపీ నేత నందం సుబ్బయ్య కొన్నిరోజుల కిందట ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురయ్యాడు. సుబ్బయ్య అంత్యక్రియలు నిన్న జరగాల్సి ఉన్నప్పటికీ అనుకోని పరిణామాల నేపథ్యంలో ఇవాళ్టికి వాయిదాపడ్డాయి. ఈ ఉదయం సుబ్బయ్యకు అంత్యక్రియలు నిర్వహించగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు.

సుబ్బయ్య అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి నివాళి అర్పించానని వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని, సాక్షులను ప్రలోభపెట్టినా, వారికి ఏం జరిగినా వైఎస్ జగన్ దే బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసులు హామీ ఇచ్చిన మేరకు న్యాయం జరగకపోతే మళ్లీ ప్రొద్దుటూరుకు వస్తా... మళ్లీ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

వాస్తవానికి సుబ్బయ్య అంత్యక్రియలు నిన్న నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. అయితే, ఎఫ్ఐఆర్ లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది పేరు, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ పేర్లు లేకపోవడంతో హతుడు నందం సుబ్బయ్య భార్య అపరాజిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆ ముగ్గురి పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చేంతవరకు అంత్యక్రియలు చేయరాదని నిర్ణయించుకుని, అప్పటికప్పుడు దీక్షకు కూర్చున్నారు.

దాంతో పోలీసులు అపరాజితతో చర్చించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ రూపొందించినందున కోర్టును సంప్రదించి మిగిలిన ముగ్గురి పేర్లు చేర్చుతామని హామీ ఇవ్వడంతో గురువారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నారా లోకేశ్ నిన్న రాత్రి కూడా ప్రొద్దుటూరులోనే ఉన్నారు.
Nara Lokesh
Nandam Subbaiah
Funerals
Murder
Proddutur
Kadapa District

More Telugu News