Shankar: పాన్ ఇండియా మల్టీ స్టారర్ కు ప్లాన్ చేస్తున్న శంకర్!

  • కమలహాసన్ తో శంకర్ 'ఇండియన్ 2'
  • నిర్మాతతో విభేదాలతో ఆగిన సినిమా 
  • కొత్తగా దక్షిణాది హీరోలతో మల్టీ స్టారర్
  • యశ్, విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్    
Director Shankar plans for a multi starrer

దక్షిణాదిన తమిళ దర్శకుడు శంకర్ కున్న ఇమేజే వేరు. ఆయనొక సినిమా చేస్తున్నాడంటే దానికి అటు అభిమానుల్లోనూ.. ఇటు బిజినెస్ వర్గాలలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. సమాజంలోని పలు సమస్యలను తీసుకుని వాటికి వినోదాన్ని రంగరించి చక్కని సినిమాగా రూపొందించడంలో శంకర్ దిట్ట. అదే కోవలో ప్రస్తుతం కమలహాసన్ తో 'ఇండియన్ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ చిత్ర నిర్మాతకు, ఈయనకు బడ్జెట్ విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో ఈ ప్రాజక్టు తాత్కాలికంగా నిలిచింది.

దీంతో శంకర్ ఇప్పుడు మరో సినిమా నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రంలో దక్షిణాది భాషల నుంచి ఒక్కో హీరో నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కన్నడ నుంచి 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ దీనికి ఓకే చెప్పాడని, తమిళం నుంచి విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, తెలుగు, మలయాళ భాషల నుంచి హీరోలను ఎంపిక చేసే పనిలో ప్రస్తుతం శంకర్ వున్నాడట.  

ఇక ఇప్పటికే ఈ చిత్రం కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్టును సిద్ధం చేశారని, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ దీనిని నిర్మిస్తారని సమాచారం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో దీనిని నిర్మించడానికి ప్రణాళికలు వేస్తున్నారు.

More Telugu News