Dhoni: ఐపీఎల్ లో తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన ధోనీ

  • తాజా ఐపీఎల్ సీజన్ లో చివరి మ్యాచ్ ఆడేసిన చెన్నై
  • ధోనీని రిటైర్మెంటుపై ప్రశ్నించిన కామెంటేటర్
  • ఇది తన చివరి మ్యాచ్ కాదన్న ధోనీ
Dhoni clarifies over IPL retirement speculations

యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ ను ఇవాళ ఆడింది. ఈ సందర్భంగా మ్యాచ్ కామెంటేటర్ డానీ మోరిసన్.... చెన్నై కెప్టెన్ ధోనీ రిటైర్మెంటుపై ప్రశ్నించాడు. "పసుపు రంగు జెర్సీలో ఇదే మీ చివరి మ్యాచా?" అని అడిగాడు. అందుకు ధోనీ బదులిస్తూ "ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు" అని స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్ సందర్భంగా ధోనీ తన జెర్సీలను ఇతరులకు కానుకగా ఇస్తుండడంతో బహుశా తన చివరి మ్యాచ్ సందర్భంగా ఇలా ఇస్తున్నాడేమోనంటూ ఊహాగానాలు బయల్దేరాయి. ఈ సీజన్ లో కనీసం ప్లే ఆఫ్ దశకు కూడా చేరని నేపథ్యంలో 2021 సీజన్ కు ధోనీ తప్పుకుంటాడన్న వాదనలు వినిపించాయి.  కానీ, 'నా చివరి మ్యాచ్ ఇది కాదు' అంటూ రిటైర్మెంటుపై జరుగుతున్న ప్రచారానికి ధోనీ చెక్ పెట్టాడు.

అటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం ధోనీ నాయకత్వంపై ఇప్పటికీ ఎంతో నమ్మకం చూపుతోంది. వచ్చే సీజన్ లోనూ చెన్నై జట్టును నడిపించేది ధోనీయేనని, తమ జట్టుకు ధోనీ 3 టైటిళ్లు అందించాడని చెన్నై జట్టు సీఈఓ విశ్వనాథన్ తెలిపారు.

More Telugu News