Nara Lokesh: లోకేశ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో వైసీపీ కార్యకర్తల 'జై జగన్' నినాదాలు... పరిస్థితి ఉద్రిక్తం!

  • తూర్పు గోదావరి జిల్లాలో నేడు లోకేశ్ పర్యటన
  • వరద బాధితులను పరామర్శించిన లోకేశ్
  • జై జగన్ నినాదాలతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం
  • పోలీసుల రంగప్రవేశం
Jai Jagan slogans in Lokesh tour of East Godavari district

వరద ప్రభావిత తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరదల్లో పంటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోతే సీఎం జగన్ హెలికాప్టర్ లో తిరుగుతున్నారని విమర్శించారు. 'పంటలు మునిగిపోతే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఎక్కడున్నారు?... జగన్ అలా, మంత్రులు ఇలా!' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దశలో అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు 'జై జగన్' అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. లోకేశ్ పర్యటనలో జగన్ నినాదాలు వినిపించడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో ఇరువర్గాల మధ్య వాడీవేడి వాతావరణం నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు భారీగా తరలివచ్చారు. లోకేశ్ పర్యటనలో ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అంతకుముందు లోకేశ్... గొల్లప్రోలు ఈబీసీ కాలనీ ఏలేరు ముంపు ప్రాంతాల్లోనూ, సుద్ధవాగు, సూరాడపేట ప్రాంతాల్లోనూ పర్యటించారు.

More Telugu News