Pawan Kalyan: అమర్ నాథ్ గారి మరణ వార్త విని కలత చెందాను: పవన్ కల్యాణ్

  • గొప్ప ప్రజానాయకుడు జంగటి అమర్ నాథ్
  • అనంతపురం జిల్లా కరువు నివారణ కోసం తాపత్రయపడేవారు
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
Pawan Kalyan pays tributes to Jangati Amarnath

అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికై పరితపించే జంగటి అమర్ నాథ్ గారు మృతి చెందారని తెలిసి చాలా కలత చెందానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనది అందరి మంచితనం కోరుకునే గొప్ప వ్యక్తిత్వమని కొనియాడారు. మృదుస్వభావి, స్నేహశీలి అయిన అమర్ నాథ్ తనకు చాలా సన్నిహితులని చెప్పారు. 2016 నవంబర్ లో అనంతపురంలో జనసేన బహిరంగ సభ నిర్వహణలో ఆయన అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.

అనంతపురం జిల్లా కరవు నివారణ కోసం ఆయన ఎంతో తాపత్రయపడేవారని పవన్ తెలిపారు. నీటిపారుదల రంగంలో నిపుణులైన ఒక బృందాన్ని, రైతులను తన వద్దకు తీసుకొచ్చారని చెప్పారు. జిల్లాలోని నీటి కష్టాలను వివరించారని అన్నారు.

అనంతపురంలో రైతులు, నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయడానికి ఆయన తీసుకొచ్చిన బృందమే కారణమని చెప్పారు. అలాంటి ఒక ప్రజా నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

More Telugu News