Kasturi: సుస్మిత, ఐశ్వర్యల అందం నా ఓటమికి కారణమైంది: నటి కస్తూరి

  • మిస్ ఇండియా పోటీలను తలచుకున్న కస్తూరి
  • నాడు ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచిన కస్తూరి
  • నాగార్జున షేక్ హ్యాండిస్తే ఒకరోజు చేతులు కడుక్కోలేదు
  • తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న కస్తూరి
Susmita Intresting Comments in an Interview

'భారతీయుడు' చిత్రంలో కమలహాసన్ పక్కన ఓ విభిన్నమైన పాత్రలో నటించి, ఆపై 'నిప్పురవ్వ', 'అన్నమయ్య', 'ఆకాశవీధిలో', 'గాడ్ ఫాదర్' తదితర చిత్రాల్లో నటించి, మెప్పించిన సీనియర్ నటి కస్తూరి, తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకుంది. ఐశ్వర్యా రాయ్, సుస్మితాసేన్ లతో పాటు ఒకే వేదికపై మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీ పడి ఫైనల్స్ వరకూ వెళ్లి ఓడిపోయానని, వాళ్లకున్న అద్భుతమైన అందమే తన ఓటమికి కారణమైందని పేర్కొంది.

కమలహాసన్ తో నటించే సమయానికి తన వయసు 16 సంవత్సరాలు మాత్రమేనని గుర్తు చేసుకున్న కస్తూరి, ఆ సినిమాలో పోషించిన పాత్ర తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించింది. నాగార్జునతో నటించే సమయంలో క్రష్ వచ్చిందని, ఓ సారి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే, ఆ చేతిని కడుక్కోకుండా ఒక రోజంతా ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తనకు ధోనీ అంటే చాలా ఇష్టమని, ఎవరైనా హీరోకు తాను తల్లిగా నటించాలంటే, అదే హీరో తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయాలని చెప్పింది.

తన కెరీర్ పీక్ దశలో ఉన్న సమయంలో డేట్స్ కుదరక 'సింధూరం', 'ఆమె' చిత్రాలను మిస్ అయ్యాయని, ఆ బాధ ఇప్పటికి కూడా ఉందని వ్యాఖ్యానించిన కస్తూరి, అన్నమయ్యలో నటించడం తనకు దక్కిన అద్భుతమైన వరమని చెప్పింది. తాను స్కూల్ లో చదువుతూ ఉన్న సమయం నుంచి రమ్యకృష్ణ సినిమాల్లో నటిస్తున్నారని, ఇప్పుడు తన కుమార్తెలు స్కూల్ లో చదువుతున్నా ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉన్నారని, ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ రావడం తన అదృష్టమని వ్యాఖ్యానించింది.

More Telugu News