Tamil Nadu: పరువు కోసం కన్న కూతుర్ని హతమార్చిన తండ్రి.. ఆపై రక్తి కట్టించే నాటకం!

  • తన కుమార్తె ప్రేమలో ఉందని తెలిసి ఆగమేఘాల మీద పెళ్లి
  • అత్తారింటికి వెళ్లనని మారం చేసిన కుమార్తె
  • ప్రేమికుడితో వెళ్లిపోతుందేమోనన్న భయంతో దారుణం
honour killing in tamil nadu

ప్రేమించిన యువకుడితో కుమార్తె వెళ్లిపోతే తన పరువు పోతుందని భావించిన ఓ తండ్రి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆపై స్నానాల గదిలో జారిపడి చనిపోయినట్టు నమ్మించాడు. పోస్టుమార్టం రిపోర్టులో అతడు చేసిన దారుణం వెలుగు చూడడంతో కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర మేరకు చెందిన బాలాజీ కుమార్తె సెంతారకై స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలిసిన బాలాజీ కుమార్తెకు మరో యువకుడితో ఆగమేఘాల మీద పెళ్లి జరిపించాడు. ఈ పెళ్లి ఇష్టం లేని సెంతారకై అత్తారింటికి వెళ్లనని భీష్మించింది. దీంతో ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోతుందేమోనని తండ్రి భయపడ్డాడు. అదే జరిగితే తన పరువు రోడ్డున పడుతుందని ఆందోళన చెందాడు.

దీంతో కుమార్తె గొంతు నులిమి చంపేశాడు. ఆపై బాత్రూములో కాలు జారి పడినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అతడి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గొంతు నులమడం వల్లే యువతి మరణించినట్టు పోస్టుమార్టంలో తేలింది. దీంతో బాలాజీని నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు మధురాంతకం సబ్ జైలుకు తరలించారు.

More Telugu News