SII: అక్టోబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ ‘కొవిషీల్డ్’ టీకా?

  • దేశంలో వచ్చే నెలలో తదుపరి ప్రయోగాలు
  • ఆక్స్‌ఫర్డ్ ‘కొవిషీల్డ్’ తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు
  • అక్టోబరు కాదు డిసెంబరులో వస్తుందన్న సీరమ్ చైర్మన్
Oxford vaccine covishield may come on October

కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న ప్రపంచం టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేళ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) శుభవార్త చెప్పింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. దేశంలో వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ టీకా ‘కొవిషీల్డ్’ తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు పూనావాలా పేర్కొన్నారు.

ఇక, దేశీయంగా ఉత్పత్తి చేసిన ‘కోవాగ్జిన్’ టీకాను మానవులపై ప్రయోగించేందుకు భువనేశ్వర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎస్‌యూఎంలో స్క్రీనింగ్ ప్రారంభమైంది. కాగా, అక్టోబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ టీకా వస్తుందన్న పూనావాలా వ్యాఖ్యలకు విరుద్ధంగా, టీకా డిసెంబరు నాటికి అందుబాటులో వస్తుందని ఆ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా చెప్పడం గమనార్హం.

ఆక్స్‌ఫర్డ్ టీకా తొలి దశ ప్రయోగాలు విజయవంతంగా ముగిశాయని, ఆస్ట్రియాలో రెండు, మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. భారత్‌లో కనీసం వందకోట్ల డోసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని, పేదలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువకే దీనిని అందుబాటులో ఉంచుతామని సైరస్ పూనావాలా తెలిపారు.

More Telugu News