Yanamala: ఇప్పటికీ అడ్డంకులు కలిగించాలని చూస్తే.. రాజ్యాంగ సంక్షోభంలో పడినట్టే: యనమల
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని గవర్నర్ ఆదేశించడం సంతోషకరమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ న్యాయ విభాగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైందని చెప్పారు. ఎస్ఈసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటినుంచైనా నిబంధనలకు అనుగుణంగా జగన్ ప్రవర్తించాలని హితవు పలికారు. ఇప్పటికీ నిమ్మగడ్డకు అడ్డంకులను సృష్టించాలని భావిస్తే మాత్రం... రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభంలో పడినట్టేనని చెప్పారు.