Maharashtra: మరుగుదొడ్డిలోనే ప్రాణాలు విడిచిన కోవిడ్ రోగి.. 8 రోజులైనా గుర్తించని వైనం!

  • చికిత్స పొందుతూ కనిపించకుండా పోయిందన్న ఆసుపత్రి వర్గాలు
  • 8 రోజులుగా మరుగుదొడ్ల వైపు వెళ్లని సిబ్బంది
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తప్పవన్న కలెక్టర్
woman died in toilet in maharashtra hospital

కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్డికి వెళ్లిన మహిళా రోగి అకస్మాత్తుగా కుప్పకూలి మరణిస్తే.. 8 రోజుల వరకు గుర్తించని అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో జరిగిందీ ఘటన.

కరోనాతో బాధపడుతూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ఇక్కడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వీరిలో 82 ఏళ్ల వృద్ధురాలు చికిత్స పొందుతూ కనిపించకుండా పోయిందంటూ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె అదృశ్యమైన 8 రోజుల తర్వాత బుధవారం వృద్ధురాలి మృతదేహం ఆసుపత్రి మరుగుదొడ్డిలో కనిపించింది.

కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఆమె శ్వాస ఆడక అక్కడే పడి మరణించినట్టు నిర్ధారించారు. దీనిని బట్టి గత 8 రోజులుగా మరుగుదొడ్డిని శుభ్రం చేయడానికి అటువైపు ఎవరూ వెళ్లలేదన్న విషయం అర్థమవుతోందని కలెక్టర్ అవినాశ్ ఢకనే పేర్కొన్నారు. అంతేకాదు, సిబ్బంది తోడు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లబోయిన మరో ముగ్గురు కూడా మరణించినట్టు తమకు తెలిసిందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఇదే ఆసుపత్రిలో చేరిన ఆమె కోడలు ఐసీయూలో బెడ్‌ కోసం వేచి చూస్తూ ప్రాణాలు విడిచింది.

More Telugu News