Maharashtra: అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించిన దళిత యువకుడిపై అమానుష దాడి.. మృతి!

  • మహారాష్ట్రలోని పుణెలో ఘటన
  • యువకుడిపై ఉమ్మివేసి, రాళ్లు, రాడ్లతో దాడి
  • రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన యువకుడు
  • యువకుడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
lover killed in maharashtra

అగ్రవర్ణ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావంటూ ఓ దళిత యువకుడిపై అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. అతడిని చావబాదడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన దళిత యువకుడు విరాజ్‌ విలాస్‌ జాగ్తాప్‌(20) ఓ అమ్మాయిని ప్రేమించాడు.

దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల వారు ఆ యువకుడికి ఫోన్‌ చేసి మాట్లాడాలని పిలిపించారు. దీంతో అతడు వారి ఇంటికి వెళ్లాడు. కులం పేరుతో అతడిని తిడుతూ అవమానించడంతో అతడు అక్కడ నుంచి బయటకు వచ్చి బైక్‌పై వెళ్లాడు.

అయితే, మధ్యలో ఆ యువకుడిని అమ్మాయి తరఫు బంధువులు ఆరుగురు అడ్డుకుని టెంపోతో దాడి చేశారు. దీంతో విరాజ్‌ బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. ఆ యువకుడి ముఖంపై ఉమ్మి వేస్తూ, రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న విరాజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.

More Telugu News