Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల మధ్య విచిత్ర పరిస్థితి... తెలంగాణకు రావచ్చు, ఏపీకి వెళ్లేందుకు ఆంక్షలు!

  • అంతరాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి
  • ఎవరైనా రావచ్చని స్పష్టతనిచ్చిన తెలంగాణ
  • క్వారంటైన్ తప్పనిసరంటున్న ఆంధ్రప్రదేశ్
One Can Come to Telangana but not Andhrapradesh

నిత్యమూ లక్షలాది మంది రాకపోకలతో, వేలాది బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగే ప్రయాణాలు, అన్ లాక్ 1.0లో భాగంగా కేంద్రం అనుమతించినా, ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆంక్షలతో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తెలంగాణకు వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకున్నా, ఏపీకి వెళ్లాలంటే మాత్రం ఆంక్షల చట్రం అడ్డుకుంటోంది.

అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రయాణికులను అనుమతిస్తుండగా, ఏపీకి వెళ్లాలంటే మాత్రం ఈ-పాస్ తప్పనిసరి కానుంది. అంతరాష్ట్ర రాకపోకలపై కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసిన వెంటనే, తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. బస్సు ప్రయాణికులకు రాత్రి పూట కర్ఫ్యూ నుంచి కూడా ఉపశమనాన్ని కేసీఆర్ సర్కారు కల్పించింది. బస్టాండ్లలోకి ఆటోలు, క్యాబ్ లకు కూడా అనుమతినిచ్చింది.

ఇక ఇదే సమయంలో ఏపీ మాత్రం ఇంకా ఆంక్షలను సడలించ లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ తమ రాష్ట్రానికి వచ్చే వారు క్వారంటైన్ నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ఆర్టీసీ ఆన్ లైన్ బుకింగ్ సేవలను కూడా ప్రారంభించింది. రాష్ట్రం నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాలకు అన్ని రకాల సర్వీసులకూ రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీకి మాత్రం ఇంకా రిజర్వేషన్లు ప్రారంభం కాలేదు.

ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ఏపీ సర్కారుతో చర్చించి, ప్రజలకున్న ఇబ్బందులు తొలగించేలా నిర్ణయాలు తీసుకునేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

More Telugu News