Bihar: వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. 16 మంది వలస కూలీల దుర్మరణం

  • బీహార్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి
  • మహారాష్ట్రలో బస్సు, ట్రక్కు ఢీ
  • యూపీలో డీసీఎం బోల్తా
16 Migrant workers dead in different road accidents

బీహార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. భాగల్‌పూర్ జిల్లాలోని నౌగచ్చియా వద్ద వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోపక్క, మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలస కూలీలు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. షోలాపూర్ నుంచి ఝార్ఖండ్‌కు వెళ్తున్న వలస కూలీల బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

ఇదిలావుంచితే, సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వలస కూలీలతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి బోల్తాపడడంతో ఈ ఘటన జరిగింది.

More Telugu News