New Delhi: ఇన్‌స్టా గ్రూప్‌లో స్కూలు పిల్లల అశ్లీల చర్చ.. పోలీసుల షాక్.. ఒకరి అరెస్ట్!

  • అమ్మాయిలను ఎలా వేధిద్దామని చర్చ
  • సామూహిక అత్యాచారం చేద్దామంటూ ప్లాన్
  • ఒక విద్యార్థి అరెస్టు.. దర్యాప్తు ప్రారంభం
  • కలకలం రేపుతోన్న ఢిల్లీ బడి పిల్లల తీరు
Delhi Schoolboy Held Over Shocking Chatroom That Talked About Girls Rape

వారంతా బడి పిల్లలు.. అందరి వయసు 17 ఏళ్లలోపే ఉంటుంది. ఆడుతూపాడుతూ, చదువుకునే వయసు వారిది. కానీ, తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ఎంతగా అంటే దేశం యావత్తూ విస్మయానికి గురయ్యే పనులు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గ్రూప్ క్రియేట్ చేసి అందులో అమ్మాయిల గురించి నీచంగా మాట్లాడుతున్నారు.

'బోయిస్ లాకర్ రూమ్' గా ఆ గ్రూప్‌కి పేరు పెట్టారు. చివరకు ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసుల దృష్టికి వెళ్లడంతో, వాటిని చూసి షాక్ అయిన ఢిల్లీ సైబర్ నేరాల నిరోధక శాఖ పోలీసులు ఒక అబ్బాయిని అరెస్టు చేశారు. అతడి మొబైల్‌ ఫోనును సీజ్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, దక్షిణ ఢిల్లీలోని ఆరు బడులకు చెందిన 11, 12వ తరగతుల విద్యార్థులు 20 మంది ఓ ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూప్‌లో ఉన్నారు. వారంతా అమ్మాయిలపై అత్యాచారం చేయడం, లైంగికంగా వేధించడం వంటి అంశాలపై చర్చించుకుంటున్నారు. ఆ గ్రూప్‌లో టీనేజ్‌ అమ్మాయిల ఫొటోలను ఆ అబ్బాయిలు పోస్ట్ చేస్తూ అసభ్యకర రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

తమ తరగతిలో చదివే అమ్మాయిలపై అత్యాచారం చేయాలని వారు సంభాషించుకుంటున్నారు. రేప్‌ కల్చర్‌ను ప్రారంభిచాలంటూ చర్చించుకుంటున్నారు. 'అందరం కలిసి సామూహిక అత్యాచారం చేద్దాం' అంటూ వారు సంభాషించుకున్న ఓ స్క్రీన్‌ షాట్ బయటకు వచ్చింది. 'ఆమెపై చాలా సులువుగా అత్యాచారం చేయొచ్చు.. మీరు ప్లాన్‌ వేసి ఎప్పుడు పిలిచినా నేను వస్తాను.. సామూహిక అత్యాచారం చేద్దాం' అంటూ అందులో పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది.

ఈ విషయాన్ని గుర్తించి కొందరు సామాజిక మాధ్యమాల్లో  #BoysLockerRoom పేరుతో పోస్టులు చేయడంతో ఈ హ్యాష్ ట్యాగ్ ఇండియాలో టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ బడి పిల్లలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ గ్రూప్‌ను డియాక్టివేట్‌ చేసిన పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు చెప్పాలని ఫేస్‌బుక్‌కు లేఖ రాశారు.

ఆ బడి పిల్లల తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్‌తో ఇంట్లో ఉంటోన్న పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి చర్చలకు పాల్పడుతుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

More Telugu News