India: దేశంలో 24 గంటల్లో 51 మంది కన్నుమూత.. పెరుగుతున్న మరణాల శాతం!

  • దేశంలో 29,974 వైరస్ నిర్ధారిత కేసులు 
  • 937కు పెరిగిన మరణాలు
  • మహారాష్ట్రలోనే సగం పైగా మరణాలు
51 corona patients died in India in 24 hours

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, కరోనా మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 51 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సగానికిపైగా అంటే.. 27 మంది మహారాష్ట్రకు చెందిన వారే కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అలాగే, గుజరాత్‌కు చెందిన వారు 11 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ఏడుగురు ఉండగా, రాజస్థాన్‌లో ఐదుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 937కు పెరిగింది.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. నిన్న సాయంత్రం నాటికి దేశ వ్యాప్తంగా 29,974 వైరస్ నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఇక, సోమవారంతో పోలిస్తే మంగళవారం మరణాల సంఖ్య 5.75 శాతం, కోలుకున్న వారి సంఖ్య 10.45 శాతం పెరిగాయి. మొత్తం బాధితుల్లో 3.12 శాతం మంది మృత్యువాత పడగా, 23.44 శాతం మంది కోలుకున్నారు. గత రెండు రోజులుగా కేసుల పెరుగుదల 5.4, 5.6 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News