balharshah: మహారాష్ట్రలో దారుణం.. క్షణికావేశంలో కుమారుల్ని కాల్చి తానూ కాల్చుకున్న తండ్రి!

  • తండ్రి, పెద్ద కుమారుడి మృతి
  • ప్రాణాలతో పోరాడుతున్న మరో కుమారుడు
  • కుటుంబ కలహాలే కారణమని అనుమానం
Father shot son and later shot himself

క్షణికావేశంలో ఏం చేస్తున్నాడో తెలియని ఓ తండ్రి కుమారులపై కాల్పులు జరిపి, అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా బల్లార్షలో జరిగిందీ ఘటన.  పట్టణానికి చెందిన మూల్‌చంద్ ద్వివేదీ (50) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ద్వివేదీ స్థానికంగా బొగ్గు గనులు, సిమెంట్ కార్ఖానాలకు భద్రతా సిబ్బందిని సరఫరా చేస్తుంటాడు. అతడి వద్ద లైసెన్స్ వున్న తుపాకి ఉంది.

కుమారులు ఆకాశ్ ద్వివేదీ (22), పవన్ ద్వివేదీ (20)లతో మూల్‌చంద్‌కు నిన్న గొడవ జరిగింది. అది మరింత ముదరడంతో ఆగ్రహం పట్టలేని మూల్‌చంద్ తన తుపాకితో కుమారులిద్దరిపైనా కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో మూల్‌చంద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పెద్ద కుమారుడు ఆకాశ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పవన్ మృత్యువుతో పోరాడుతున్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News