Mohan Babu: ఇప్పుడున్న కులాలు రెండే... ఆ విషయం చెప్పడానికి కరోనా వచ్చింది: మోహన్ బాబు

  • ఒకటి పాజిటివ్, మరొకటి నెగెటివ్ అంటూ వివరణ
  • ఈ విషయం తెలుసుకుంటే జీవితం గొప్పగా ఉంటుందని వ్యాఖ్యలు
  • ఇప్పటికీ తెలుసుకోలేకపోతే వృథా అని వెల్లడి
Mohan Babu opines on corona situations

టాలీవుడ్ అగ్రనటుడు మోహన్ బాబు ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో మోహన్ బాబు వ్యాఖ్యలు డైనమైట్లలా పేలాయి. ఇప్పుడున్న కులాలు రెండేనని, ఒకటి పాజిటివ్, మరొకటి నెగెటివ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయం అందరికీ తెలియజెప్పడానికే కరోనా వచ్చిందని భావిస్తున్నానని అన్నారు.

కులాలు రెండేనన్న సంగతి తెలుసుకున్నవాడి జీవితం ఎంతో గొప్పగా ఉంటుందని, కులం కులం అని కొట్టుకునేవాళ్లు ఇప్పటికీ ఆ విషయం తెలుసుకోలేకపోతే వృథా అని పేర్కొన్నారు. అహంకారం, డబ్బు ఇప్పుడేమీ చేయలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. తన దృష్టిలో చెడు వ్యక్తిత్వం ఉన్నవాడే తక్కువ కులం అని భావిస్తానని తెలిపారు.

తన పెద్దకుమారుడు విష్ణు ఆలోచన ప్రకారం తన పరిధిలోని వలస కార్మికులకు భోజనం పెడుతున్నామని, దీన్ని తాము గొప్పగా భావించడంలేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని ఆ దేవుడ్ని కోరుకుంటున్నామని తెలిపారు.

More Telugu News