Kanika Kapoor: ప్రిన్స్ చార్లెస్ తో కనిక కపూర్ పాత ఫొటో తెచ్చిన కలకలం.. నెటిజన్ల ఫైర్!

  • ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్
  • చార్లెస్ ను కనిక కలిసిన ఫొటోలు వైరల్
  • మళ్లీ టార్గెట్ చేసిన నెటిజన్లు
Kanika Kapoors photos with Prince Charles goes viral

బాలీవుడ్ గాయని కనిక కపూర్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు మూడు సార్లు పరీక్షలను నిర్వహించగా... మూడు సార్లు పాజిటివ్ అని తేలింది. మరోవైపు, ఆమె పార్టీలలో పాల్గొనడంతో... ఆమెతో పాటు గడిపిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుతం ఆమెతో పాటు, ఆమె కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్ లో ఉన్నారు. ఆమెపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.

మరోవైపు, బ్రిటీష్ యువరాజు చార్లెస్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో లండన్ లో ప్రిన్స్ చార్లెస్ తో కనిక కపూర్ మాట్లాడుతున్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రిన్స్ చార్లెస్ కు ఆమె ద్వారానే కరోనా సోకి వుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, ఈ ఫొటోలు 2015లో ఓ ఈవెంట్ సందర్భంగా తీసినవని పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అప్పట్లో రాచకుటుంబం నిర్వహించిన ఆ ఈవెంట్ కు కనిక హాజరయిందని... ఆ సందర్భంగా ప్రిన్స్ చార్లెస్ తో కాసేపు ముచ్చటించిందని తెలుస్తోంది.

More Telugu News