Rajya Sabha: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ జారీ

  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ అసెంబ్లీ కార్యదర్శి
  • రేపటి నుంచి నామినేషన్ పత్రాల జారీ
  • మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఉపసంహరణకు మార్చి 18న తుది గడువు
  • మార్చి 26న అసెంబ్లీ కమిటీ హాల్ లో పోలింగ్
Notification issued for Rajya Sabha new members in AP

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ లో పదవీ విరమణ పొందుతున్నారు. వీరి స్థానాల్లో కొత్త సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యుల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ నుంచి ఎన్నికైన కె.కేశవరావు, మహ్మత్ అలీఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి వచ్చే నెలతో మాజీలు అవుతారు. వీరి స్థానంలో నలుగుర్ని ఎన్నుకునేందుకు తాజా నోటిఫికేషన్ జారీ అయింది.

రేపటి నుంచి అమరావతిలోని అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలు అందుబాటులో ఉంచుతారు. మార్చి 13వ తేదీ మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆపై, మార్చి 18 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ప్రధాన ఘట్టమైన పోలింగ్ ఏపీ అసెంబ్లీలోని కమిటీ హాల్ లో మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అటు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది.

More Telugu News