Roja: అది తెలుగుదేశం పార్టీ ఆఫీసా? లోకేశ్ వైన్ షాపా?: బోండాకు రోజా ఘాటు​ కౌంటర్​

  • అధికారం కోల్పోయిన టీడీపీ నాయకులకు పిచ్చెక్కింది
  • ఇంగితజ్ఙానం లేని విధంగా బోండా ఉమ ప్రెస్ మీట్ ఉంది
  • లిక్కర్ బాటిల్స్ తో కూర్చున్న బోండా ఓ సేల్స్ మెన్ లా ఉన్నారు
YSRCP mla Roja slams Bonda Uma

ప్రజల కోసం పాటుపడుతున్న సీఎం జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. మద్యం విక్రయాల వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వంపై బోండా ఉమ చేసిన తీవ్ర ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అధికారం కోల్పోయిన టీడీపీ నాయకులకు పిచ్చెక్కిందన్న విషయం అన్ని సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తోందని విమర్శించారు. ప్రజలు ఏమనుకుంటారోనన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా బోండా ఉమ ప్రెస్ మీట్ ఉందని, చాలా సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

టీడీపీ కార్యాలయంలో లిక్కర్ బ్రాండ్స్ ను తన ముందు పెట్టుకుని కూర్చున్న బోండా ఉమ.. వైన్ షాపులోనో, బార్ లోనో ఓ సేల్స్ మెన్ లా ఉన్నారని, ‘అది తెలుగుదేశం పార్టీ ఆఫీసా? లోకేశ్ వైన్ షాపా? అది పార్టీ ఆఫీసా? చంద్రన్న బెల్టు షాపా?’అనే అనుమానం తలెత్తుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే కల్లు తాగిన కోతులు ఎలా వ్యవహరిస్తాయో టీడీపీ నేతలూ అలా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News