Andhra Pradesh: అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో నేలతల్లికి ప్రణమిల్లిన చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో గొప్పగా ఊహించుకున్న అమరావతి నగరం ఇవాళ జీవకళ కోల్పోయిన స్థితిలో చూసి చంద్రబాబు భావోద్వేగాలకు గురయ్యారు. ఉండవల్లిలో నిన్నమొన్నటిదాకా గొప్పగా వెలిగిన ప్రజావేదిక స్థానంలో ఖాళీ భూమి దర్శనమివ్వడం చూసి ఆయన నోట మాట రాని స్థితిలో వెనుదిరిగారు. ఇక, రాజధాని అమరావతి కోసం దేశంలోని నలుమూలల నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, నదుల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని చూడగానే చంద్రబాబు నేలతల్లికి సాష్టాంగపడ్డారు. భక్తితో మట్టికి ప్రణమిల్లారు. చంద్రబాబు వెంట ఉన్న అచ్చెన్నాయుడు తదితరులు కూడా శంకుస్థాపన వేదికకు నమస్కరించారు.