పవన్ కు పెళ్లిళ్లపై మక్కువ ఉంటే, జగన్ కు ప్రజాసేవపై మక్కువ ఉంది: పేర్ని నాని వ్యాఖ్యలు

  • పెళ్లయినా, ప్రజాసేవ అయినా మనసుకు నచ్చినట్టు చేస్తారన్న మంత్రి
  • పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయలేదంటూ సమర్థన
  • అందరూ కోరితేనే ఇంగ్లీషు మీడియం తెస్తున్నామని వెల్లడి
జనసేనాని పవన్ కల్యాణ్, సీఎం జగన్ మధ్య విమర్శల పరంపర నడుస్తోంది. పవన్ పై జగన్ మూడు పెళ్లిళ్లు, నలుగురైదుగురు పిల్లలు అంటూ వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడగా, 'జాగ్రత్తగా మాట్లాడండి' అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలతో బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని తాజా పరిణామాలపై స్పందించారు. పెళ్లిళ్లు, రాజకీయాలు, ప్రజాసేవ తదితర అంశాలను ఎవరైనా మనసుకు నచ్చినట్టు చేస్తారని అన్నారు. పవన్ కు పెళ్లిళ్ల మీద మక్కువ ఉంటే, సీఎం జగన్ కు ప్రజాసేవపై మక్కువ ఉందని తెలిపారు.

సీఎం జగన్ ఎప్పుడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, వెంకయ్యనాయుడు గురించి గతంలో చేసిన విమర్శలను పవన్ గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ ను ఎంతోమంది యువత కోరారని, పాదయాత్ర సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు జగన్ కు సూచనలు చేశారని పేర్ని నాని వెల్లడించారు. అందరి కోరిక మేరకే ఇంగ్లీషు మీడియం తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు.
Go Back to Shorts
Perni Nani
Pawan Kalyan
Jagan
Andhra Pradesh
YSRCP
Jana Sena

More Telugu News