టీడీపీ చేసిన తప్పే జగన్ చేస్తున్నాడు... చంద్రబాబుకు పట్టిన గతే ఆయనకూ పడుతుంది: శివరాజ్ సింగ్ చౌహాన్

  • ఒకే కులానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు
  • పద్ధతి మార్చుకోకపోతే జనాలు ఇంటికి పంపుతారు
  • 2024లో ఏపీలో అధికారాన్ని చేపడతాం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం మాదిరే ఇప్పుడు జగన్ కూడా ఒకే కులానికి ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు కూడా పడుతుందని... పద్ధతి మార్చుకోకపోతే జగన్ ను కూడా జనాలు ఇంటికి పంపుతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదని... 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి, అధికారాన్ని చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలను చేయించి, పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరులో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేస్తున్నామని చౌహాన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మూసేద్దామని గాంధీ చెబితే... నెహ్రూ వద్దన్నారని, ఇప్పుడు ఆ పనిని రాహుల్ గాంధీ చేస్తున్నాని ఎద్దేవా చేశారు. మోదీపై కక్ష పెంచుకుని, దేశమంతా తిరిగిన చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే దిక్కు లేకుండా పోయిందని అన్నారు. దురాశకు పోయి చంద్రబాబు భంగపడ్డారని చెప్పారు. ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదని చెప్పారు.
Go Back to Shorts
Jagan
Chandrababu
Shivraj Singh Chauhan
Telugudesam
BJP
YSRCP

More Telugu News