YSRCP: న్యూఢిల్లీలో వైకాపా శిబిరం వద్ద ఉద్రిక్తత... వైవీ సుబ్బారెడ్డిని బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించిందన్న వైద్యుల రిపోర్టుతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించేందుకు వచ్చిన వేళ, న్యూఢిల్లీలోని దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన్ను తరలించేందుకు వీలు లేదంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ఆపై కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు వైవీ సుబ్బారెడ్డిని బలవంతంగా ఆంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని హాస్పిటల్ కు తరలించిన సంగతి తెలిసిందే.