Chandrababu: చంద్రబాబునాయుడి చిత్తశుద్ధిపై అనుమానం వస్తోంది: ముద్రగడ
కాపు రిజర్వేషన్ల అంశంపై పత్రికల్లో వస్తున్న కథనాలను పరిశీలిస్తే, చంద్రబాబునాయుడి చిత్తశుద్ధిపై తనకు సందేహం వస్తోందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడుకి ఈరోజు ఓ లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లను గవర్నర్ సంతకంతో రాష్ట్ర పరిధిలో అమలు చేయవచ్చని న్యాయకోవిదులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర పరిధిలో అమలు చేయకుండా రాష్ట్రపతి అనుమతికి పంపించడంతో చంద్రబాబు చిత్తశుద్ధిని, నిబద్ధతను అనుమానించే పరిస్థితి తలెత్తిందని అన్నారు. కాపు జాతికి నష్టపెట్టే చర్యలు చేపట్టవద్దని, తమరు ప్రకటించిన రిజర్వేషన్లు తక్షణం అమలు చేయకుండా మమ్మల్ని మోసపుచ్చాలని చూస్తే సహించమని ఆ లేఖలో పేర్కొన్నారు.