8వ పే కమిషన్ ముందు కీలక సవాళ్లు.. పాత పెన్షన్ పునరుద్ధరణ సాధ్యమేనా?

8వ పే కమిషన్ ముందు కీలక సవాళ్లు.. పాత పెన్షన్ పునరుద్ధరణ సాధ్యమేనా?

8th Pay Commission faces key challenges and demands for Old Pension Scheme restoration
  • 8వ వేతన సంఘం ముందు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు డిమాండ్
  • కనీస వేతనం రూ.68,000కు పెంచాలని విజ్ఞప్తి
  • ఇతర అలవెన్సులు సవరించాలంటున్న ఉద్యోగ సంఘాలు
  • పింఛనర్ల డిమాండ్ల అమలులో న్యాయపరమైన చిక్కులు 
  • 2027 జూన్‌లోగా కమిషన్  నివేదిక సమర్పించే అవకాశం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల వేతన సవరణ కోసం ఏర్పాటైన 8వ వేతన సంఘం (8th Central Pay Commission) ముందు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రద్దు చేసిన పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాలనే డిమాండ్ ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఇటీవల చెన్నైలో జరిగిన సంప్రదింపుల సమావేశంలో పింఛనర్ల సంఘాల ప్రతినిధులు ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

చెన్నై జీపీఓ పింఛనర్ల ఫోరమ్ సహా పలు సంఘాలు తమ డిమాండ్ల జాబితాను కమిషన్‌కు సమర్పించాయి. వీటిలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం, పింఛన్, కుటుంబ పింఛన్ మొత్తాలను గణనీయంగా పెంచడం, కమ్యుటేషన్ రికవరీ నిబంధనలను సరళీకరించడం వంటివి ఉన్నాయి. 

వీటితో పాటు 'మోడిఫైడ్ అష్యూర్డ్ కెరియర్ ప్రోగ్రెషన్' (ఎంఏసీపీ) ప్రయోజనాలను సవరించాలని, అలవెన్సులు, సెలవుల నిబంధనలు, సామాజిక భద్రతను మెరుగుపరచాలని కోరారు. పదేళ్లపాటు వేచి చూడకుండా వేతన సవరణ కోసం ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, కనీస వేతనాన్ని నెలకు రూ.68,000గా నిర్ణయించాలని కూడా వారు డిమాండ్ చేశారు.

జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 2025 నవంబర్‌లో ఏర్పాటైన ఈ కమిషన్, తన నివేదికను 18 నెలల్లోగా అంటే సుమారుగా 2027 మే-జూన్ నాటికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతున్న కమిషన్, సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు చండీగఢ్‌లో తదుపరి సమావేశాలు నిర్వహించనుంది.

అమలులో న్యాయపరమైన చిక్కులు
అయితే, పింఛనర్లు, ఉద్యోగులు చేస్తున్న కొన్ని డిమాండ్ల అమలులో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ న్యాయ నిపుణురాలు, సీఎంఎస్ ఇండస్‌లా పార్టనర్ అమృతా టోంక్ ఈ విషయంపై స్పందిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 

"పింఛన్, గ్రాట్యుటీ అనేవి ఉద్యోగులు ఇప్పటికే చేసిన సేవలకు ప్రతిఫలంగా చెల్లించేవి. కాబట్టి 2026కు ముందు రిటైర్ అయిన వారి ప్రయోజనాలకు కోత విధించడం లేదా నిలిపివేయడం చట్టపరంగా నిలవకపోవచ్చు. ఏవైనా మార్పులు కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి వర్తింపజేయడం సముచితం" అని ఆమె వివరించారు.

అలాగే, సివిల్ సర్వీస్ ఉద్యోగులకు కూడా 'వన్ ర్యాంక్, వన్ పెన్షన్' విధానాన్ని విస్తరించాలనే డిమాండ్ కొత్త అసమానతలకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు. వివిధ శాఖలు, కేడర్ల మధ్య ఉద్యోగ నిర్మాణం, కెరియర్ పురోగతిలో చాలా వ్యత్యాసాలు ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. అయితే, వార్షిక ఇంక్రిమెంట్ల పెంపు వంటి డిమాండ్లను అమలు చేయడం సులభమని, ఎందుకంటే అవి భవిష్యత్తుకు వర్తిస్తాయని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ సిఫార్సులను చాలా రాష్ట్రాలు యథాతథంగా అమలు చేస్తుండటంతో భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా స్పష్టమైన కట్-ఆఫ్ తేదీలు, పరివర్తన నిబంధనలు ప్రకటించడం అత్యవసరమని ఆమె సూచించారు. దీంతో 8వ పే కమిషన్ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Advertisement
8th Pay Commission
Old Pension Scheme
Central Government Employees
OPS Restoration
Minimum Wage Hike
8th CPC Recommendations

More Telugu News