టీటీడీ స్కూళ్లలో తన ఇద్దరు కుమారులు.. ఐఏఎస్ అధికారి గోపీనాథ్ స్ఫూర్తిదాయక నిర్ణయం

టీటీడీ స్కూళ్లలో తన ఇద్దరు కుమారులు.. ఐఏఎస్ అధికారి గోపీనాథ్ స్ఫూర్తిదాయక నిర్ణయం

IAS Officer Gopinath Inspiring Decision to Enroll Sons in TTD Schools
  • టీటీడీ జేఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి ప్రభల గోపీనాథ్
  • ప్రైవేట్ పాఠశాలల నుంచి తన ఇద్దరు కుమారులను మాన్పించిన వైనం
  • తిరుపతిలోని టీటీడీ పాఠశాలల్లో 7వ, 4వ తరగతుల్లో చేర్పించిన జేఈవో
  • ఉన్నత అధికారి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు, ఆదర్శంగా నిలిచారంటూ అభినందనలు
ఉన్నత హోదాలో ఉన్న అధికారులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదివించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. కానీ, దీనికి భిన్నంగా టీటీడీ జేఈవో, ఐఏఎస్ అధికారి ప్రభల గోపీనాథ్ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తన ఇద్దరు కుమారులను టీటీడీ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో చేర్పించి అందరి దృష్టిని ఆకర్షించారు.

వివరాల్లోకి వెళితే.. గ్రూప్-1 అధికారిగా సర్వీసులో చేరి ఐఏఎస్ హోదా పొందిన ప్రభల గోపీనాథ్, గత ఆగస్టు నెలలోనే టీటీడీ జేఈవో (వైద్యం, విద్య)గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన తన పెద్ద కుమారుడు ఆనంద్ మహిత్‌ను తిరుపతిలోని ఎస్‌జీఎస్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతిలో, చిన్న కుమారుడు నాగ అనీష్ అగస్త్రను ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై నమ్మకంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

అంతేకాకుండా గోపీనాథ్ సతీమణి ప్రతిరోజూ స్వయంగా పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లి, సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ, ట్రస్ట్ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందనే బలమైన సందేశాన్ని తన చర్య ద్వారా చాటిచెప్పిన జేఈవో గోపీనాథ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Prabhala Gopinath
TTD JEO
Tirupati Schools
IAS Officer Children
TTD Educational Institutions
SV Primary School

More Telugu News