ర్యాంక్ వచ్చిన వ్యక్తి వెరిఫికేషన్ కు సర్టిఫికెట్లు తీసుకురాకపోతే అది ఎవరితప్పు?: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu asks whose fault if ranker fails certificate verification
  • మెగా డీఎస్సీపై విమర్శలను తిప్పికొట్టిన సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వంలో గ్రూప్ 1 పేపర్లు ప్లంబర్లతో దిద్దించారని ఆరోపణ
  • రాజకీయ చెత్తను కూడా శుభ్రం చేయాలని ప్రజలకు పిలుపు
  • గొడ్డలి పార్టీ పాలనలో నకిలీ మద్యంతో 30 వేల మంది చనిపోయారన్న సీఎం
  • ఉత్తరాంధ్రను ఇండస్ట్రియల్ కారిడార్‌గా మారుస్తామని హామీ
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీలో ఒక్క శాతం కూడా అవినీతి జరగలేదని, జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియకు బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 సర్వీస్ పరీక్షల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇంట్లో పనిచేసేవారితో సమాధాన పత్రాలు దిద్దించిన వాస్తవాలు వెలుగు చూస్తుండటంతో, ఇప్పుడు డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలమండ కోడూరులో జరిగిన 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మెగా డీఎస్సీని అడ్డుకోవడానికి 300 పిటిషన్లు వేశారు. వాటన్నింటినీ ఎదుర్కొని ఉద్యోగాలు ఇస్తుంటే, ఏడాది తర్వాత ఆరోపణలు చేస్తున్నారు. ర్యాంక్ వచ్చిన వ్యక్తి వెరిఫికేషన్‌కు సర్టిఫికెట్లు తేకపోతే అదెవరి తప్పు? క్రీడా కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచి ఉద్యోగాలిస్తే, ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారమే క్రీడాకారులకు ప్రాధాన్యం ఇచ్చాం. ఎవరో ఎక్కడో డబ్బులు అడిగారని మొత్తం డీఎస్సీకి అంటగట్టడం దుర్మార్గం. గొడ్డలి పార్టీ అధినేత పీఏ వందల కోట్లు సంపాదించారు, దాని గురించి ఎవరూ మాట్లాడరేం?" అని నిలదీశారు. తప్పు చేసిన వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.

గత ఐదేళ్ల పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "ఐదేళ్ల పాటు గొడ్డలి పార్టీ విధ్వంసాలు, నేరాలు, ఘోరాలనే నమ్ముకుంది. వారి హయాంలో సరఫరా చేసిన నకిలీ మద్యం కారణంగా రాష్ట్రంలో సుమారు 30 వేల మంది అనారోగ్యంతో చనిపోయారు. కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి, తమకు నచ్చని వారి భూములను 22ఏ జాబితాలో పెట్టారు. ఆ దుర్మార్గాలను సరిదిద్దడానికే మాకు మూడేళ్ల సమయం పడుతోంది. ఇప్పుడు మేం ప్రతి నెలా 9వ తేదీన 'మీ భూమి-మీ హక్కు' పేరుతో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారు. ఉపాధ్యాయులను అగౌరవపరిచారు" అని చంద్రబాబు ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం రెండింతల సంక్షేమం అందిస్తూనే అభివృద్ధి పనులు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. "గత పాలకులు సంక్షేమం ఇస్తున్నామని చెప్పి రోడ్లు కూడా వేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక రోడ్ల రూపురేఖలు మార్చాం. ప్రజలు ఈ చెత్తతో పాటు రాజకీయ చెత్తను కూడా కడిగేయాలి. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే. అప్పుడే రాజకీయ నేతలూ తప్పులు చేయరు" అని పిలుపునిచ్చారు. 

'దీపం 2.0' ద్వారా నాలుగు నెలలకు ఒకసారి మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులను ఆడబిడ్డల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో ఇప్పుడు ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు వస్తున్నారని, ప్రపంచాన్ని జయించే విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి మన ఉపాధ్యాయులకు ఉందని అన్నారు.

ప్రతి గ్రామం 'జీరో వేస్ట్' గ్రామంగా మారాలని ఆకాంక్షించారు. "రెండేళ్లలో రాష్ట్రంలో 143 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను డిస్పోజ్ చేశాం. చెత్త నుంచి గ్యాస్, ఎరువులు తయారు చేస్తున్నాం. స్వచ్ఛ రథాల ద్వారా చెత్త సేకరించి, నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. 'స్వయం' పేరుతో డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పిస్తున్నాం" అని వివరించారు.

ఈ సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభిస్తున్నామన్నారు. వచ్చే నెలలోనే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరందిస్తామని ప్రకటించారు. ఉత్తరాంధ్రను పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని, 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ నిర్మిస్తామని చెప్పారు. స్థానిక యువతకు స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి నైపుణ్యాలు అందిస్తామన్నారు. రూ.29 కోట్లతో ఎన్టీఆర్ రిజర్వాయర్ పనులు, రైవాడ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు మంచి చెడులను విశ్లేషించి, మంచి ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు.
Advertisement
Chandrababu Naidu
Mega DSC Recruitment
Andhra Pradesh CM News
Swachhandhra Swarnandhra
Deepam 2 Gas Scheme
Anakapalli Development

More Telugu News