సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీకి చంద్రబాబు

Chandrababu Naidu to attend Southern Zonal Council meeting
  • మహాబలిపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన భేటీ
  • విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు అవకాశం
  • దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై సీఎం ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తులు-అప్పుల పంపకం, రెవెన్యూ లోటు భర్తీ వంటి ఆర్థిక అంశాల్లో కేంద్రం వెంటనే చొరవ చూపి పరిష్కరించాలని కోరనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంపైనా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని కూడా ముఖ్యమంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజుపట్నం పోర్టు, విశాఖపట్నం-విజయవాడ మెట్రో ప్రాజెక్టులు, రైల్వే కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావిస్తారు. ఇదే సమయంలో, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుకు అందిస్తున్న నిధుల విషయంలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిగిలిన ప్రాజెక్టులకు కూడా అనుమతులు, నిధులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.
Advertisement
Chandrababu Naidu
Southern Zonal Council Meeting
Amit Shah
Andhra Pradesh Bifurcation Issues
Mahabalipuram Zonal Council
AP Reorganisation Act

More Telugu News