ఝార్ఖండ్‌లోనూ విద్యార్థులదే పైచేయి.. దిగొచ్చిన ప్రభుత్వం.. జేఎస్ఎస్ సీ-సీజీఎల్ పరీక్ష రద్దు

Jharkhand students win as government cancels JSSC CGL exam
  • ఝార్ఖండ్ లో ఫలించిన విద్యార్థుల పోరాటం
  • హేమంత్ సోరెన్ సర్కార్ కీలక నిర్ణయం
  • వివాదాస్పద పరీక్ష రద్దు, విచారణకు ఆదేశం!
  • పరీక్షల నిర్వహణ సంస్థ టీడీపీఎల్‌పై వేటు, అన్ని పరీక్షలు రద్దు
  • 2014 నుంచి జరిగిన అక్రమాలపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఝార్ఖండ్‌లో ఉద్యోగార్థులు, విద్యార్థులు సాగించిన సుదీర్ఘ పోరాటం ఫలించింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (JSSC-CGL) పరీక్షను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. పేపర్ లీకేజీ, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసనలకు ప్రభుత్వం దిగివచ్చింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అభిజీత్ దీప్కే నేతృత్వంలో సీజేపీ నిర్వహించిన జెన్ జీ ఉద్యమం సఫలం అయిన నేపథ్యంలో, ఝార్ఖండ్ విద్యార్థుల ఉద్యమంపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది 

సోమవారం సీఎం హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్నోకు చెందిన 'టీడీపీఎల్' (TSR Data Processing Private Limited) అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. "టీడీపీఎల్ సంస్థకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను రద్దు చేయాలని నిర్ణయించాం. ఆ సంస్థ నిర్వహించిన పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల జాబితాలు సహా అన్నీ రద్దవుతాయి" అని సోరెన్ మీడియాకు వివరించారు.

ఈ అక్రమాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కమిటీ 2014 నుంచి జరిగిన నియామక పరీక్షల్లోని లోపాలు, అవకతవకలపై దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

ప్రభుత్వ నిర్ణయంతో గత 24 రోజులుగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు, అభ్యర్థులు ఆనందంలో మునిగిపోయారు. రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ పోరాటానికి నాయకత్వం వహించిన విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, విచారణ పారదర్శకంగా జరగాలని, తమ ప్రధాన డిమాండ్ అయిన సీబీఐ విచారణపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
Advertisement
Hemant Soren
JSSC CGL exam cancelled
Jharkhand paper leak
Jharkhand Staff Selection Commission
Jharkhand student protests
TDPL exam irregularities

More Telugu News