సభలోనైనా, బయటైనా.. డిబేట్ కు నేను రెడీ: జగన్ కు నారా లోకేశ్ సవాల్

Nara Lokesh challenges Jagan for a debate inside or outside the assembly
  • డీఎస్సీ 2025పై ఎక్కడైనా చర్చకు సిద్ధమని లోకేశ్ సవాల్
  • ముఖ్యమంత్రి తొలి సంతకాన్ని అడ్డుకోవాలన్నదే వైసీపీ కుట్ర అని ఆరోపణ
  • 148 రోజుల్లో 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడి
  • డీఎస్సీపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తిప్పికొట్టిన మంత్రి
  • ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని హామీ
"గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి సవాల్ విసురుతున్నా. డీఎస్సీ-2025పై చర్చకు నేను సిద్ధం. సభ లోపలైనా, బయటైనా సరే.. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండి" అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో సుదీర్ఘ ప్రకటన చేసిన ఆయన, ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను బెయిల్‌పై లేనని, తనపై సీబీఐ, ఈడీ కేసులు లేవని, విదేశాలకు వెళ్లేందుకు తనకేమీ కోర్టు అనుమతులు అవసరంలేదని ఎద్దేవా చేశారు. చర్చకు వస్తే వాస్తవాలు తేలుతాయని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని లోకేశ్ గుర్తుచేశారు. ఈ నియామక ప్రక్రియను కేవలం 148 రోజుల్లో పూర్తి చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. 3.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, టీసీఎస్ అయాన్ వంటి సురక్షిత ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఈ డీఎస్సీని అడ్డుకోవడానికే వైసీపీ నాయకులు 141 కేసులు వేశారని, సీఎం తొలి సంతకం అమలు కాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నారని ఆరోపించారు.

ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి

మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నపత్రం లీక్ అయిందన్నది అవాస్తవమని, 42 వేల ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ర్యాండమ్‌గా ప్రశ్నలు వస్తాయని, లీకేజీకి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి ప్రశ్నపత్రం రూపకల్పనలో ప్రమేయం లేదని, అతను శాఖాపరమైన అనుమతులు తీసుకోనందునే అనర్హుడయ్యాడని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఒకే సామాజికవర్గానికి మేలు చేశారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. మొత్తం 372 మందిలో 46 మంది ఓసీ, 185 మంది బీసీ, 112 మంది ఎస్సీ, 29 మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారని గణాంకాలతో సహా వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే 65 క్రీడాంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, శాప్ ఆధ్వర్యంలో పారదర్శకంగా వెరిఫికేషన్ జరిపామని పేర్కొన్నారు.

విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఫలితంగా 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోయారని లోకేశ్ విమర్శించారు. టీడీపీ హయాంలోనే 1.80 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశామని గుర్తుచేశారు. యువగళం పాదయాత్రలో కర్నూలు జిల్లాలో వలస కూలీల పిల్లల దుస్థితిని చూసి, మెగా డీఎస్సీ ద్వారా ఆ జిల్లాకు అధిక సంఖ్యలో టీచర్లను కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేశామని, ఈ విధానాన్ని ప్రశ్నించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు.

యువతకు భరోసా

ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిందని యువతకు భరోసా ఇచ్చారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి, వేలాది ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. "ఈ ఏడాది కూడా 3,000 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తాం. ప్రతి ఏటా క్రమం తప్పకుండా టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి" అని లోకేశ్ పిలుపునిచ్చారు. 

డీఎస్సీ అంటే 'డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్' అని చెప్పే దౌర్భాగ్యపు పార్టీ రాష్ట్రంలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పారదర్శక నియామకాలకు మద్దతుగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరో మూడు డీఎస్సీలు నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు.
Advertisement
Nara Lokesh
YS Jagan Mohan Reddy
Mega DSC 2024
AP Teacher Recruitment
Andhra Pradesh Education Minister
Mega DSC Debate

More Telugu News