బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తుల మృతి

Bihar temple stampede six devotees dead in Lakhisarai district
  • బీహార్‌లోని అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట
  • ఘటనలో పలువురికి గాయాలు
  • శ్రావణ మూడో సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు
  • రెండు రైళ్లు రావడంతో ఒక్కసారిగా పెరిగిన రద్దీ
  • బ్యారికేడ్లు కూలడంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడి
బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రావణ మాసం మూడో సోమవారం కావడంతో అశోక్ ధామ్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.

ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారని తెలిపారు. ఉదయం 6:30 - 6:45 గంటల సమయంలో రెండు రైళ్లు రావడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పారు. భారీ జనసందోహం కారణంగా ఒకవైపు బ్యారికేడ్లు విరిగిపోయాయని, దీంతో జనం ఒకరిపై ఒకరు పడిపోయి ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Bihar Stampede
Ashok Dham Temple
Lakhisarai District
Shravan Monday
Bihar Temple Tragedy
Shailendra Kumar DM

More Telugu News