నాకు తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయమా? అధికారులపై డీకే శివకుమార్ ఫైర్.. గుట్కా నిషేధంపై యూటర్న్

DK Shivakumar fires on officials over Gutka ban decision without his knowledge
  • గుట్కా నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం యోచన
  • వక్క రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • తనకు తెలియకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై అధికారులపై సీఎం శివకుమార్ ఆగ్రహం
  • ప్రజారోగ్యం, రైతుల ప్రయోజనాలు రెండింటినీ కాపాడాలని మాజీ సీఎం బొమ్మై హితవు
  • ప్రభుత్వ నిర్ణయంతో గుట్కా కొనుగోలుకు ఎగబడుతున్న వినియోగదారులు
కర్ణాటకలో గుట్కా నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వం వెనక్కి తగ్గేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వక్క (అడక) రైతులు తీవ్రంగా నష్టపోతారని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. గుట్కా నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి.

గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగినట్లు సమాచారం. ఇంతటి కీలకమైన నిర్ణయం తన దృష్టికి రాకుండా ఎలా జారీ చేశారని సీఎం అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ కార్యదర్శిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్వులు జారీ చేసే ముందు తనతో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. రాష్ట్రంలోని ఏడెనిమిది జిల్లాల్లో రైతులు పూర్తిగా వక్క సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

అంతకుముందు కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి గుట్కా నిషేధం వల్ల వక్క రైతులకు జరిగే నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం గురించి తనకు తెలియదని, సమస్యను పరిష్కరిస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. తమతో సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ పరిణామంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. ప్రజారోగ్యం, రైతుల ప్రయోజనాల మధ్య ప్రభుత్వం సమతుల్యం పాటించాలని సూచించారు. "ఆరోగ్యం ముఖ్యమే, కానీ వక్క రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకప్పుడు మల్నాడు ప్రాంతానికే పరిమితమైన వక్క సాగు, ఇప్పుడు రాష్ట్రంలోని చాలా జిల్లాలకు విస్తరించింది. రైతులు ఐదేళ్ల పాటు పెట్టుబడి పెట్టి పంట కోసం ఎదురుచూస్తారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు వారిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఒకవేళ నిషేధం అమలు చేయాలనుకుంటే రైతులకు నష్టపరిహారం అందించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

వక్క రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే, ముఖ్యంగా మల్నాడు ప్రాంతంలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని జేడీఎస్ ఎమ్మెల్యే ఎ. మంజు హెచ్చరించారు. "రైతుల ఆందోళనలకు మేం మద్దతిస్తాం. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి" అని ఆయన కోరారు. 

మరోవైపు, గుట్కా నిషేధం వార్తలతో వినియోగదారులు ఆందోళనకు గురై, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. కొందరైతే బస్తాల్లో గుట్కా ప్యాకెట్లను తీసుకెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వివాదం నేపథ్యంలో, ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Advertisement
DK Shivakumar
Karnataka Gutka ban
Areca nut farmers
Basavaraj Bommai
Karnataka government orders
Health Department officials

More Telugu News