సీదిరి అప్పలరాజుకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు
- సీదిరి కొడుకు చేసినన బైక్ యాక్సిడెంటులో ఒక వ్యక్తి మృతి
- కేసులో ఆధారాలు తారుమారు చేసేందుకు యత్నించారంటూ సీదిరిపై కేసు
- 23 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీదిరి
తన కుమారుడు చేసిన బైక్ యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి మరణించిన కేసులో ఆధారాలను తారుమారు చేసేందుకు యత్నించినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ప్రయాణిస్తున్న బైక్ ఢీకొని దానయ్య అనే ఒక గొర్రెల కాపరి మృతి చెందిన ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా జులై 22న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దాదాపు 23 రోజుల పాటు ఆయన జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ మధ్య కాలంలో పలుమార్లు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పటికీ కోర్టు తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది. అలాగే కాశీబుగ్గ పోలీసులు ఆయన్ను విచారణ నిమిత్తం కస్టడీకి కోరగా న్యాయస్థానం ఆ విజ్ఞప్తిని నిరాకరించింది. తాజాగా సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు మూడు వారాల తర్వాత ఆయన బయటకు రానుండటంతో వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.